ఆదివాసీ జెండా ఆవిష్కరించనందుకు ఆగ్రహం
ABN , First Publish Date - 2021-08-10T09:56:38+05:30 IST
ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో సోమవారం గిరిజనులు ఆందోళనకు దిగారు...
![ఆదివాసీ జెండా ఆవిష్కరించనందుకు ఆగ్రహం](https://media.andhrajyothy.com/appimg/galleries/19210299/08102021042516n95.jpg)
- మంత్రి, ఎమ్మెల్యేలను నిలదీసిన గిరిజనులు
రంపచోడవరం, ఆగస్టు 9: ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో సోమవారం గిరిజనులు ఆందోళనకు దిగారు. తొలుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యతో వాగ్వాదానికి దిగిన గిరిజనులు.. ఆతర్వాత సభకు హాజరై ఆదివాసీ చట్టాల అమలులో వైఫల్యాలు, ఆదివాసీ దినోత్సవ నిర్వహణ తీరుపై మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ధనలక్ష్మిలను నిలదీశారు. ఆదివాసీ నాయకులను మంత్రి వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఒక సందర్భంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఆదివాసీ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ‘సమస్యలపై పోరాటమంటే జెండాలు పుచ్చుకుని తిరగడం కాదని’ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో నాయకులు మరింత మండిపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆదివాసీ నాయకులను బయటకు పంపేశారు.