తిరుమలలో ప్రయోగాత్మకంగా ‘సంప్రదాయ భోజనం’ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-27T09:15:16+05:30 IST

తిరుమలలో ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

తిరుమలలో ప్రయోగాత్మకంగా ‘సంప్రదాయ భోజనం’ ప్రారంభం

8 రోజుల పాటు పరిశీలించనున్న టీటీడీ

వచ్చేనెల 8 నుంచి భక్తులకు ‘కాస్ట్‌ టు కాస్ట్‌’కు..

తిరుమల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేసి.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలుత మీడియా ప్రతినిధులకు, టీటీడీ సిబ్బందికి వడ్డించారు. రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్‌ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వడ్డించారు. సేంద్రియ ఆహారం విశిష్ఠత తెలిసేలా కాస్ట్‌ టూ కాస్ట్‌ పద్ధతిలో భక్తులకు అందించాలని నిర్ణయించింది. కాగా, 8 రోజుల పాటు పరిశీలన చేసి తర్వాత ఏయే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి, ఓ భోజనం ఎంతకు విక్రయించాలనే అంశాలపై టీటీడీ నిర్ణయానికి రానుంది. సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 


భేష్‌.. బాగుంది!

కాగా, గురువారం సంప్రదాయ భోజనం స్వీకరించిన అధికారులు, సిబ్బంది.. వంటలు చాలా రుచికరంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. తొలిరోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్‌ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించామని చిరుధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు చెప్పారు. 

Updated Date - 2021-08-27T09:15:16+05:30 IST