అవి హిందూ సమాజంపై దాడులే
ABN , First Publish Date - 2021-01-17T09:14:05+05:30 IST
దేవాలయాలపై దాడుల నిరోధానికి రాష్ట్రప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఉడిపి పెజావర్ పీఠాధిపతి, అయోధ్య రామమందిర్ కోర్ కమిటీ సభ్యుడు (దక్షిణ భారత ప్రతినిధి) విశ్వప్రసన్న తీర్థ పెజావర్ స్వామీజీ కోరారు.
- ఉడిపి పెజావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ
- దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ
విజయనగరం రూరల్/సింహాచలం, జనవరి 16: దేవాలయాలపై దాడుల నిరోధానికి రాష్ట్రప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఉడిపి పెజావర్ పీఠాధిపతి, అయోధ్య రామమందిర్ కోర్ కమిటీ సభ్యుడు (దక్షిణ భారత ప్రతినిధి) విశ్వప్రసన్న తీర్థ పెజావర్ స్వామీజీ కోరారు. అంతర్వేదిలో రథం దగ్ధం, ఆలయాల్లో పూజారులపై దాడులు, రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటనలు హిందూ సమాజంపై దాడులుగా అభివర్ణించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశామన్నారు. శనివారం విజయనగరం జిల్లా రామతీర్థానికి వచ్చిన ఆయన రాముడి విగ్రహ ధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మీడియాతో మాట్లాడారు. దాడుల ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.