డీలర్లను తొలగించే ఆలోచన లేదు
ABN , First Publish Date - 2021-01-13T09:02:00+05:30 IST
రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని... ప్రస్తుతం ఉన్నవారంతా ఫిబ్రవరి నుంచి స్టాకిస్టులుగా కొనసాగుతారని పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు.
![డీలర్లను తొలగించే ఆలోచన లేదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
స్టాకిస్టులుగా కొనసాగుతారు: కమిషనర్
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని... ప్రస్తుతం ఉన్నవారంతా ఫిబ్రవరి నుంచి స్టాకిస్టులుగా కొనసాగుతారని పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో డీలర్ల సంఘాల ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడారు. కమీషన్ కూడా ప్రస్తుతం ఉన్న విధానంలోనే వస్తుందని, కొత్తగా పంపిణీలోకి రాబోతున్న వాహనాల డ్రైవర్లు, వలంటీర్లతో కలిసి పనిచేయాలని కోరారు. కాగా, రేషన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన వాహనాలను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
డోర్ డెలివరీకి సహకరిస్తాం: డీలర్ల సంఘం
రేషన్ డోర్ డెలివరీ విధానానికి పూర్తిగా సహకరిస్తామని, తమను స్టాకిస్టులుగా కొనసాగించాలని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు దివి లీలామాధవరావు కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు.