‘అనంత’ పోరాట జ్వాల మహోజ్వలం కావాలి
ABN , First Publish Date - 2021-12-19T09:09:01+05:30 IST
‘అనంత’ పోరాట జ్వాల మహోజ్వలం కావాలి
![‘అనంత’ పోరాట జ్వాల మహోజ్వలం కావాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121903382559/12192021033944n23.jpg)
ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్
అనంతపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమైన రైతు కూలీ రక్షణ పాదయాత్ర పోరాట జ్వాల రాష్ట్రవ్యాప్తంగా మహోజ్వల పోరాటంగా మారాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సహాయ కార్యదర్శి విజూకృష్ణన్ పిలుపునిచ్చారు. ఏపీ రైతుసంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నెలరోజులపాటు జిల్లాలో కొనసాగిన రైతుకూలీ రక్షణ పాదయాత్ర శనివారం అనంతపురంలో ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో విజూకృష్ణన్ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు బీజేపీ రైతులను ఆదుకునేందుకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉత్పాదక వ్యవసాయంపై అదనంగా 50 శాతం విలువ రైతులకు దక్కేలా చూస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. సాక్షాత్తు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రే ఎన్నికల ముందు రైతులకిచ్చిన హామీలన్నీ ఉత్తివేనని చెప్పడం చూస్తే... రైతులు, రైతకూలీల పట్ల కేంద్ర ప్రభుత్వ ధోరణి ఏపాటిదో అర్థమవుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ రైతాంగం అదే పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ఇక్కడి ప్రభుత్వం రైతు సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేవలం రైతు భరోసా పేరుతో రూ.6వేలు ఇస్తూ... రైతులకు అంతా చేసేశామని చెప్పే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు. ఇది సరైన విధానం కాదని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.