స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానితో సీఎం మాట్లాడాలి
ABN , First Publish Date - 2021-02-06T17:56:17+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీతో సీఎం జగన్ మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీతో సీఎం జగన్ మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం, విజయసాయి రెడ్డి ఇద్దరూ మోడీతో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే ఉత్తరాంధ్రకి చెందిన తాను రాజీనామా చేస్తానని బొత్స అంటున్నారని, కానీ ఆయన రాజీనామా చేస్తే ఏం ఉపయోగం ఉండదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
విశాఖను అభివృద్ధి చేస్తానన్న విజయసాయి రెడ్డి ఇప్పుడేం చేస్తారో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తోందని ఆయన విమర్శించారు.
ఏ విషయంలోనూ ఏకతాటి మీదకు రాని పార్టీలన్నీఇప్పుడు స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏకమయ్యాయని ఆయన తెలిపారు. బీజేపీ, వైసీపీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం ఆహ్వానించదగ్గ పరిణామని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే నష్టమేమిటంటూ కొత్తగా బీజేపీలో చేరిన సుజనా ఏదేదో మాట్లాడుతున్నారని సుజనాపై రామకృష్ణ విరుకుపడ్డారు.
రూ. 1.25 లక్షల విలువైన భూములు విశాఖ స్టీల్ ప్లాంటుకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు 32 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంటులో పని చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు.
