అమరావతే రాజధాని!
ABN , First Publish Date - 2021-08-25T09:08:57+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతే కొనసాగుతుందని, అమరావతి వివాదంపై కోర్టు విచారణ నవంబరుకు వాయిదాపడినంత మాత్రాన అధైర్య పడొద్దని, న్యాయదేవత రైతుల

జగన్, బొత్స కన్న కలలన్నీ కల్లలే
విజయసాయీ.. విశాఖతో మీకేం పని?
మీడియాతో రఘురామకృష్ణ రాజు
న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతే కొనసాగుతుందని, అమరావతి వివాదంపై కోర్టు విచారణ నవంబరుకు వాయిదాపడినంత మాత్రాన అధైర్య పడొద్దని, న్యాయదేవత రైతుల పక్షానే ఉంటుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తంచేశారు. సీఎం జగన్రెడ్డి, మంత్రి బొత్స సత్తిబాబు మూడు రాజధానుల కలలన్నీ కల్లలే అవుతాయని విమర్శించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టును ఒప్పించి విశాఖకు రాజధానిని తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంలో అర్థం లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం సొమ్ముకు ‘జగనన్న అగ్రిగోల్డ్ దీవెన’గా పరిగణించడం దారుణమని రఘురామ చెప్పారు.
పరిహారమేమైనా భారతీ సిమెంట్ కంపెనీ నుంచి తెచ్చి ఇస్తున్నారా? అని నిలదీశారు. విశాఖలోని చారిత్రక వాల్తేరు క్లబ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనమేంటని, ఆయనకు విశాఖతో పనేంటని ప్రశ్నించారు. ‘సీఎం జగన్రెడ్డికి విదేశీయాత్ర ఉంటుందా.. లేక ఇంకేదైనా యాత్ర ఉంటుందా’ అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు. బుధవారం జగన్ బెయిల్ రద్దు కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు.