పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-05-30T09:27:04+05:30 IST

‘‘మతి తప్పిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరీక్షలపై తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఏడాది కూడా ఇలాగే రెండు సార్లు పరీక్షలు వాయిదా వే సి, చివరకు రద్దు చేశారు

పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి

తుగ్లక్‌ నిర్ణయాలతో విద్యాసంవత్సరం గందరగోళం: లోకేశ్‌


అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ‘‘మతి తప్పిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరీక్షలపై తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఏడాది కూడా ఇలాగే రెండు సార్లు పరీక్షలు వాయిదా వే సి, చివరకు రద్దు చేశారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ముందుచూపు లేని జగన్‌రెడ్డి నిర్ణయాలతో విద్యాసంవత్సరం గందరగోళంలో పడనుంది. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జూలైలో పరీక్షలు పెడితే... మూల్యాంకనానికి నెలన్నరకి పైగా సమయం పడుతుందన్నారు. ఫలితాలు వచ్చేసరికి సెప్టెంబరు వచ్చేస్తుందన్నారు. అడ్మిషన్లు పూర్తయ్యేసరికి అక్టోబరు గడిచిపోతుందన్నారు. ప్రతి ఏటా జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరాన్ని అక్టోబర్‌లో ప్రారంభించి నాలుగు నెలల్లో ముగించడం విద్యార్థులకు ఏం మేలు చేస్తుందో జగన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారికి సెప్టెంబరు వరకూ వ్యాక్సిన్లు ఇవ్వలేమని సీఎం చెప్పారన్నారు. అంటే పిల్లలకు వ్యాక్సిన్లు వచ్చే అవకాశం లేదన్నారు. అదే సమయంలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే థర్డ్‌ వేవ్‌ పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక వాయిదాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడడం ఆపి పది, ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్‌ చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-30T09:27:04+05:30 IST