సుప్రీంకు చేరిన నివేదిక!
ABN , First Publish Date - 2021-05-20T08:34:00+05:30 IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తెలంగాణ హైకోర్టు.. సుప్రీంకోర్టుకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సికింద్రాబాద్ ఆర్మీ

రఘురామ ఆరోగ్య పరిస్థితిపై సీల్డ్ కవర్లో పంపిన టీ-హైకోర్టు?
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజూ కొనసాగిన చికిత్స
హైదరాబాద్, మే 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తెలంగాణ హైకోర్టు.. సుప్రీంకోర్టుకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వచ్చాక గత సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షలు, అందించిన వైద్యంపై ఆస్పత్రి మెడికల్ బోర్డు అధికారులు అందించిన నివేదిక, వీడియో రికార్డింగ్ను సీల్డ్ కవర్లో బుధవారం సమర్పించినట్లు సమాచారం. ఇంకోవైపు.. రఘురామరాజు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మొదటి రోజు మంగళవారం సేకరించిన రక్త నమూనాలకు సంబంధించిన పలు ల్యాబ్ రిపోర్టులు బుధవారం అందాయి.
ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యులతో ఏర్పాటైన మెడికల్ బోర్డు.. వాటిని పరీక్షించి అందుకు తగినట్లుగా చికిత్స అందిస్తోంది. రెండో రోజు బీపీ, షుగర్, హార్ట్ బీట్ వంటి సాధారణ పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి పూర్తి భద్రత మధ్య ఆయనకు వైద్యం అందిస్తున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండనున్నారు.