ముద్రగడవి ఉత్తుత్తి లేఖలు: Chinarajappa
ABN , First Publish Date - 2021-11-23T18:27:52+05:30 IST
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ముద్రగడవి ఉత్తుత్తి లేఖలు: Chinarajappa](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112312553511/11232021125700n80.jpg)
అమరావతి: కాపు నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఉనికిని కాపాడుకోవడానికే ముద్రగడ సందర్భానుసారం ఉత్తుత్తి లేఖలు వదులుతుంటారని వ్యాఖ్యానించారు. కాపులకు న్యాయం చేస్తానని నమ్మించి, వారిని కేసుల్లో ఇరికించిన ముద్రగడ.. జగన్ భయంతో ఇంట్లో దాక్కున్నారని అన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లతో పాటు, విదేశీ విద్య సహా అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. కాపులకు మేలు చేస్తున్నవ్యక్తిని అడుగడుగునా కాపు నేత అడ్డుకున్నారని ఆరోపించారు. ముద్రగడకు రాష్ట్రంలోని పరిస్థితులు అర్థంకావడం లేదా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కాపు జాతికి ఏమీ చేయనని చెప్పాక కూడా పద్మనాభం తన ముసుగు తీయకపోతే ఎలా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేర్చే వరకు తామంతా ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ముద్రగడ ఇంట్లో కూర్చొని ఉత్తరాలు రాయకుండా, బయటకొచ్చి కాపులకు నష్టం జరక్కుండా చూడాలని చినరాజప్ప సూచించారు.