స్టీల్ ప్లాంట్ మీద రాబందుల కన్ను : అనిత
ABN , First Publish Date - 2021-02-06T20:32:27+05:30 IST
వైజాగ్ను నాశనం చేయటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారా..?’ అంటూ వైసీపీ సర్కార్పై రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు...

విశాఖ: ‘వైజాగ్ను నాశనం చేయటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారా..?’ అంటూ వైసీపీ సర్కార్పై రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే ప్రేమ ఉందో, పగ ఉందో అర్థమవుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్పై మబ్బులు కమ్మాయనిపిస్తోందని,.. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న .. స్టీల్ ప్లాంట్ మీద రాబందుల కన్నుపడినట్లుందని విమర్శించారు. ఉక్కు పరిశ్రమకు ఒక చరిత్ర వుందని, ఇది తెలుగు ప్రజలతో విడదీయలేని బంధమని ఆమె కొనియాడారు. విశాఖ చరిత్ర తెలిసినవారెవ్వరూ ఇలాంటి నిర్ణయం తీసుకోరని పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని... విశాఖ ప్రజలు ఓటేస్తే గెలిచే ఎంపీ, ఎమ్మెల్యేలు ఇకనైనా రాజీనామా చేసి.. ఉక్కు పరిశ్రమను కాపాడ్డానికి ముందుకు రావాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారన్నారు. ఇప్పుడైనా కళ్లు తెరిచి ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అనిత పిలుపునిచ్చారు.