వ్యవసాయశాఖ ప్రక్షాళన!
ABN , First Publish Date - 2021-10-20T09:18:25+05:30 IST
: రాష్ట్ర వ్యవసాయ శాఖలో కీలక పోస్టుల విషయంలో సమూల మార్పులు జరగనున్నాయి. కమిషనర్ సహా, పలువురు వివాదాస్పద అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కడప, విశాఖ మినహా, మిగతా

త్వరలో అంతర్గత బదిలీలు.. కమిషనర్ సహా కొందరిపై చర్యలు?
అమరావతి-ఆంధ్రజ్యోతి: రాష్ట్ర వ్యవసాయ శాఖలో కీలక పోస్టుల విషయంలో సమూల మార్పులు జరగనున్నాయి. కమిషనర్ సహా, పలువురు వివాదాస్పద అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కడప, విశాఖ మినహా, మిగతా జిల్లాల జేడీఏ పోస్టుల్లో డీడీఏలు ఇన్చార్జి జేడీఏలుగా కొనసాగుతున్నారు. కమిషనరేట్లో పలువురు ఉద్యోగులు అక్కడక్కడే పోస్టింగులు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జేడీఏ పోస్టులు, 27 డీడీఏ పోస్టులు ఖాళీగా ఉండగా, ఏడీఏలకు డీడీఏలుగా, డీడీఏలకు జేడీఏలుగా గత మూడున్నరేళ్లుగా పదోన్నతులు కల్పించలేదు. పదోన్నతులు దక్కకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని కొందరు ఆవేదన చెందుతున్నారు. పైగా సీనియర్లకు పదోన్నతులు ఇవ్వకుండా, జూనియర్లకు ఇన్చార్జి బాధ్యతలివ్వడం వివాదాస్పదమవుతోంది. కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవహారంలో కమిషనర్ తీరుపై అనేక ఆరోపణలు చేస్తూ, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. కమిషనర్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఒకరోజు నిరసన కూడా తెలిపారు.
దీనిపై వ్యవసాయ మంత్రి కన్నబాబు, స్పెషల్ సీఎస్ పూనంమాలకొండయ్య స్పందించి, ఉద్యోగుల ఇబ్బందుల్ని తొలగిస్తామని వ్యవసాయ అధికారుల సంఘానికి హామీ ఇచ్చారు. అర్హులకు పదోన్నతులివ్వకుండా, ఇన్చార్జిలతో పాలన సాగించడం వల్ల.. వ్యవసాయశాఖ ప్రగతి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో కమిషనర్తో సహా, వివాదాస్పద అధికారులపై త్వరలోనే చర్యలుంటాయని తెలిసింది.