14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
ABN , First Publish Date - 2021-10-29T08:23:41+05:30 IST
14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతన సమావేశం
హాజరుకానున్న 8 రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వచ్చే నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. దీనికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సమీర్శర్మ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 8 రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన సాయంతోపాటు వివిధ అంశాలపై చర్చిస్తారు. సమావేశం నాటికి రహదారులు మెరుగుపరచడంతోపాటు, ప్రముఖులందరికీ పటిష్ఠ బందోబస్తు, రవాణా, వాహనాలు సమకూర్చడం.. ఏయే శాఖల అధికారులు ఏయే బాధ్యతలు నిర్వహించేదీ సీఎస్ నిర్దేశించారు. ఐటీ కార్యదర్శి జయలక్ష్మి, అదనపు డీజీ రవిశంకర్, టీటీడీ ఈవో, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.