ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా?
ABN , First Publish Date - 2021-05-11T09:38:34+05:30 IST
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కు వైద్యానికి వెళ్ళే హక్కు తెలుగువారికి లేదా? అని మాజీ మంత్రి, టీడీపీపొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రశ్నించారు
చంద్రన్న బీమా పునరుద్ధరించాలి: సోమిరెడ్డి
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కు వైద్యానికి వెళ్ళే హక్కు తెలుగువారికి లేదా? అని మాజీ మంత్రి, టీడీపీపొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది. అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ బేదాభిప్రాయాలు తలెత్తాయో తెలియదుగాని తెలుగు బిడ్డలకు తెలంగాణలో వైద్యం చేయించుకొనే హక్కు లేదనడం దుర్మార్గం. చెన్నై, బెంగుళూరు వెళ్ళడానికి అక్కడి ప్రభుత్వాలు అడ్డుచెప్పడం లేదు. ఇక్కడ చెప్పడం సరికాదు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆలోచన చేయాలి’’ అని సూచించారు. రాజకీయ భేదాభిప్రాయాలతో పేదలకు అందుబాటులో ఆహారాన్ని అందించే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడం తగదన్నారు. పొరుగున కొత్తగా వచ్చిన స్టాలిన్ ప్రభుత్వాన్ని చూసైనా జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని తెరవాలని సోమిరెడ్డి సూచించారు. కుటుంబంలో 18 ఏళ్లు పైబడిన వారు ఎందరు చనిపోయినా చంద్రన్న బీమా వర్తించేలా, రూ.2 లక్షలు సాయం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణకు ఆ హక్కు లేదు: బుచ్చయ్య
టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం ఒక ట్వీట్ చేస్తూ... ‘‘2024 వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. కనీసం అంబులెన్సులను అడ్డుకోవద్దు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చించి భేషజాలకు పోకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని బుచ్చయ్య ట్వీట్ చేశారు.