ఏసీబీ వలలో నెలకు ఆరుగురు
ABN , First Publish Date - 2021-12-31T08:24:06+05:30 IST
ఏసీబీ వలలో నెలకు ఆరుగురు
అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం
ఆతర్వాతి స్థానాల్లో ఇంధన, పంచాయతీరాజ్ శాఖలు
వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీ పీఎ్సఆర్
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకు ఆరుగురు చొప్పున అవినీతిపరులు ఏసీబీకి చిక్కారు. అవినీతిలో అత్యధికంగా రెవెన్యూ శాఖ యాభై శాతం వాటా ఆక్రమించింది అంటూ ఏసీబీ వార్షిక నివేదిక వివరాలను డీజీ పీఎ్సఆర్ ఆంజనేయులు గురువారం మీడియాకు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో లంచం తీసుకొంటూ పట్టుబడ్డ మొదటి ముగ్గురు అధికారులు తహశీల్దార్లే. అవినీతి తిమింగళాల్లో టెక్కలి, చోడవరం, ముదిగుబ్బ తహశీల్దార్లు ఉండగా చిత్తూరు అటవీ అధికారి, విశాఖ విద్యుత్ ఏఈ, పాకాల సబ్ రిజిస్ట్రార్, ఒంగోలు కమర్షియల్ టాక్స్ ఉద్యోగి ఉన్నారు. ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసిన వారిలో రెవెన్యూ శాఖలో 36 మంది, ఇంధన శాఖలో 8, పంచాయతీరాజ్లో 7, హోంశాఖలో 6, పట్టణాభివృద్ధి శాఖలో ఐదుగురు, ఇతర శాఖలకు చెందిన పది మంది ఉన్నారు. అవినీతి తిమింగళాల్లో అత్యంత వెనుకబడిన సంక్షేమ శాఖ ఎండీ నాగభూషణం మొదటి స్థానంలో ఉండగా విశాఖ విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ వరప్రసాదరావు, పార్వతీపురం ఐటీడీఏ అధికారి మార్కండేయ, కర్నూలు ఇరిగేషన్ ఈఈ జాకోబ్ రాజశేఖర్, గుంటూరు ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి కోనేరు కృష్ణ భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ తెలిపింది. 11క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు, 26సాధారణ విచారణలు, 45ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీజీ తెలిపారు.