వంగవీటి రాధా ఆఫీస్ దగ్గర స్కూటీ కలకలం
ABN , First Publish Date - 2021-12-30T21:14:29+05:30 IST
తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని టీడీపీ నేత వంగవీటి రాధా కలకలం రేపారు. అయితే తనను చంపేందుకు ఎవరు కుట్ర చేశారో..
విజయవాడ: తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని టీడీపీ నేత వంగవీటి రాధా కలకలం రేపారు. అయితే తనను చంపేందుకు ఎవరు కుట్ర చేశారో.. ఆ విషయాలను రాధా గోప్యంగా ఉంచారు. రాధా ప్రకటన తర్వాత ఆయనకు ప్రభుత్వం భద్రత కూడా పెంచింది. రాధాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు రాధా చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరించి నివేదిక ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్ డీజీకి జగన్ ఆదేశాలిచ్చారు. ఈ తతంగం నడుస్తున్న నేపథ్యంలోనే వంగవీటి రాధా ఆఫీస్ దగ్గర స్కూటీ కలకలం రేపుతోంది.
రాధా ఆఫీస్ దగ్గర స్వీట్షాపు ఎదుట మూడ్రోజులుగా దుండగులు స్కూటీ ఉంచి వెళ్లారు. స్కూటీ వదిలి వెళ్లడంపై రాధా అనుచరుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూటీ వ్యవహారాన్ని ఆయన అనుచరులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్కూటీ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు స్కూటీ ఎవరిది... ఎందుకు ఇక్కడ వదిలి వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాధా నాలుగు రోజుల కిందట తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఆరోపణలు చేయడం.. ఇంతలోనే స్కూటీని వదలి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.