రాష్ట్రంలో 1.3 కోట్ల కుటుంబాలపై బండ

ABN , First Publish Date - 2021-02-05T07:43:10+05:30 IST

వంట గ్యాస్‌ ధర మళ్లీ భగ్గుమంది. గ్యాస్‌ వినియోగదారులపై పెట్రోలియం సంస్థలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి.

రాష్ట్రంలో 1.3 కోట్ల కుటుంబాలపై బండ

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌ ధర మళ్లీ భగ్గుమంది. గ్యాస్‌ వినియోగదారులపై పెట్రోలియం సంస్థలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి. ఈ పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ విజయవాడలో 14 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.716 కాగా తాజా పెంపుతో అది రూ.741కి చేరింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర రూ.750 దాటింది. గత రెండు నెలల్లోనే వరుసగా రెండుసార్లు రూ.50 చొప్పున ధరలు పెరిగాయి. మరోవైపు గ్యాస్‌ వినియోగదారులకు ప్రభుత్వం తిరిగి బ్యాంకుల్లో జమ చేస్తున్న రాయితీ భారీగా తగ్గిపోయింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఒక్కో సిలిండర్‌పై దాదాపు రూ.200 రాయితీ తిరిగి ఖాతాల్లో పడేది. ఇప్పుడు ఈ మొత్తం రూ.15కు పడిపోయింది. గ్యాస్‌ కంపెనీని బట్టి కొందరికి రూ.10, రూ.12 అందుతోంది. అంటే రూ.741 చెల్లించి గ్యాస్‌ సిలిండర్‌ తీసుకుంటే తిరిగి వచ్చే రాయితీ గరిష్ఠంగా రూ.15 మాత్రమే. ఇటీవల కరోనా కాలంలో ఈ మొత్తం కూడా చాలామంది ఖాతాల్లో జమ కాలేదు. రాష్ట్రంలో 1.37 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి.


అందులో సుమారు 5లక్షలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు ఉండగా వాటికి మాత్రమే సగటున రూ.వంద చొప్పున రాయితీ వస్తోంది. మిగిలిన 1.3కోట్లకు పైగా కుటుంబాలకూ రూ.15 మించి రాయితీ రావడం లేదు. దీంతో ప్రధాని మోదీ ప్రకటించిన ‘గివ్‌ అప్‌’ పథకంలో రాయితీ వదిలేసుకున్నవారికి, రాయితీ తీసుకుంటున్నవారికీ ఇప్పుడు తేడా లేకుండా పోయింది. మరోవైపు కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లపైనా బాదుడు పెరిగింది. విజయవాడలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,650కి చేరింది.

Updated Date - 2021-02-05T07:43:10+05:30 IST