50% సిబ్బందితోనే కోర్టులు
ABN , First Publish Date - 2021-04-23T11:02:26+05:30 IST
కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు పలు నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో 50 శాతం సిబ్బంది రోజు విడిచి రోజు పనిచేసేందుకు అనుమతిచ్చింది.
రోజు విడిచి రోజు పనిచేసేందుకు అనుమతి
హైకోర్టు, దిగువ న్యాయస్థానాలకు వర్తింపు
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు పలు నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో 50 శాతం సిబ్బంది రోజు విడిచి రోజు పనిచేసేందుకు అనుమతిచ్చింది. రిజిస్ట్రార్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ల ర్యాంక్ కలిగిన జాయింట్ రిజిస్ట్రార్లు, న్యాయమూర్తుల పీఎ్సలు రోజూ విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇతర క్యాటగిరిలకు చెందిన 50 శాతం సిబ్బంది రోజు విడిచి రోజు విధులకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. జ్యుడీషియల్ సెక్షన్లో ఎంతమంది సిబ్బంది ఉండాలనే విషయంపై జ్యుడీషియల్ రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారు తెలిపారు. రిజిస్ట్రార్ ఆదేశించినప్పుడు విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.
‘‘హైకోర్టు విచారణ విషయంలో న్యాయస్థానం అనుమతి లేకుండా తుది విచారణ వ్యాజ్యాలను లిస్ట్ చేయవద్దు. విచారణ ఇంటి వద్ద నుంచి నిర్వహించాలా? లేక హైకోర్టుకు వచ్చి నిర్వహించాలా అనే విషయం పై న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. భౌతిక పద్ధతిలో వ్యాజ్యాల దాఖలు విధానం అమల్లో ఉంటుంది. వ్యాజ్యాలకు నెంబర్ కేటాయించిన తరువాత న్యాయవాదులకు తెలియజేస్తారు. హైకోర్టు భవనంలో శానిటైజేషన్కు రిజిస్ట్రీ తగిన చర్యలు తీసుకోవాలి. విధులకు హాజరయ్యే సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు విధిగా కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కాగా తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని 50శాతం మంది ఉద్యోగులు రోజువిడిచిరోజు విధులకు హాజరయ్యేలా అనుమతించిందనందుకు హైకోర్టు ప్రధానన్యాయమూ ర్తి జస్టిస్ ఏకే గోస్వామికి హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు కృతజ్ఙతలు తెలిపారు.