మధ్యతరగతి కోసం ‘ప్లాట్లు’
ABN , First Publish Date - 2021-01-13T08:09:10+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేటు వ్యాపారులకంటే తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందిస్తోంది. దీనికి ’పట్టణ ప్రణాళికా పథకం’ అని పేరు పెట్టారు.
![మధ్యతరగతి కోసం ‘ప్లాట్లు’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పథకం విధాన రూపకల్పనకు కమిటీ
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేటు వ్యాపారులకంటే తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందిస్తోంది. దీనికి ’పట్టణ ప్రణాళికా పథకం’ అని పేరు పెట్టారు. భూసేకరణ, లేఅవుట్ల అభవృద్ధి, అమ్మకాలు వంటివాటిని ఈ పథకం కింద చేపడతారు. వీటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా ఏపీటిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సభ్యులుగా డీటీసీపీ వి. రాముడు, గృహనిర్మాణ మండలి వైస్ చైర్మన్ బి. రాజగోపాల్ నియమితులయ్యారు. కాగా, ఈ నెల 21లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.