సీనియర్‌ జర్నలిస్టు వీరాజీ కన్నుమూత

ABN , First Publish Date - 2021-08-20T08:10:54+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు, కథ, నవలా రచయిత తెలుగు పాఠకలోకానికి వీరాజీగా సుపరిచితులైన పిళ్లా కృష్ణమూర్తి (81) ఇకలేరు.

సీనియర్‌ జర్నలిస్టు వీరాజీ కన్నుమూత

కథ, నవలా రచయితగా సుపరిచితులు

సంతాపం తెలిపిన పాత్రికేయ సంఘాలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్టు, కథ, నవలా రచయిత తెలుగు పాఠకలోకానికి వీరాజీగా సుపరిచితులైన పిళ్లా కృష్ణమూర్తి (81) ఇకలేరు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. వీరాజీ స్వస్థలం విజయవాడ. ఆయనకు భార్య మీనాక్షి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తార్నాకలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు బుధవారం పూర్తయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన 12వ ఏట నుంచి రచన ప్రారంభించిన వీరాజీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ హానర్స్‌ పట్టా పొందారు. 1961 నుంచి 1991 వరకు ఆంధ్రపత్రికలో పాత్రికేయుడిగా సేవలు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి ఆర్కే నారాయణ్‌, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మోనోగ్రా్‌ఫలు రచించారు. ఆయన కలం నుంచి జాలువారిన ‘తొలి మలుపు’ నవల రష్యన్‌, బెంగాలీ భాషల్లోకి, ‘ఇద్దరం ఒకటే’ రచన ఇటాలియన్‌లోకి అనువాదం అయ్యా యి.


‘అరచేతిలో విజ్ఞానం’ పేరుతో జనరల్‌ నాలెడ్జ్‌, క్విజ్‌, పోటీ పరీక్షల పుస్తకాలు రచించారు. ‘కాగితం పడవ’, ‘గృహమేకదా స్వర్గసీమ’, ‘ఎద్దులూ - బండి’, ‘మునగ చెట్టు’  కథలు పాఠకుల ఆదరణ పొందాయి. ‘విజృంభణ’, ‘కలం చిందులు’ కవితా సంకలనాలు రచించారు. ‘సామాన్యుడి సణుగుడు’ వ్యాస సంకలనానికి ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ బయోగ్రఫికల్‌ ఇనిస్టిట్యూట్‌ ‘డిస్టింగ్విష్డ్‌ లీడర్‌షిప్‌’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌కు ఆయన రెండుసార్లు అధ్యక్షుడిగా సేవలు అందించారు.  వీరాజీ మృతికి ఏపీజేయూ, ఏఐఎన్‌ఈఎ్‌ఫ, ఆల్‌ ఇండియా న్యూస్‌పేపర్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-08-20T08:10:54+05:30 IST