ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టులో మరో పిటిషన్
ABN , First Publish Date - 2021-01-24T21:22:00+05:30 IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీగా ఎన్నికలు మారాయి.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీగా ఎన్నికలు మారాయి. రాజ్యాంగాన్ని కాపాలని ఎస్ఈసీ పిలుపు ఇస్తుంటే.. కాదుకాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. ప్రభుత్వ వాదనే ఉద్యోగసంఘాలు, పోలీసు అధికారుల సంఘం వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ సరికాదని, హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటిషన్ వేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 2021 ఓట్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. 2019 జాబితాతో 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్ అంటున్నారు. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుకు పిటిషనర్ ప్రయత్నం చేశారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున హౌజ్మోషన్కు హైకోర్టు నిరాకరించింది. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది.