లైబ్రరీ సెస్ చెల్లించండి
ABN , First Publish Date - 2021-09-10T09:35:54+05:30 IST
జిల్లా గ్రంథాలయ సంస్థలకు 2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు చెల్లించాల్సిన లైబ్రరీ సెస్ను వెంటనే చెల్లించాలని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ అన్ని మున్సిపల్ స్థానికసంస్థల కమిషనర్లను ఆదేశించారు.
మున్సిపాలిటీలకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రంథాలయ సంస్థలకు 2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు చెల్లించాల్సిన లైబ్రరీ సెస్ను వెంటనే చెల్లించాలని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ అన్ని మున్సిపల్ స్థానికసంస్థల కమిషనర్లను ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు తక్షణమే గ్రంథాలయ సంస్థలకు నిధులు జమచేయాలని నిర్దేశించారు. 2014 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు రాష్ట్రంలోని 38 మున్సిపాలిటీల్లో రూ.93.71 కోట్లు లైబ్రరీ సెస్ వసూలు చేయగా, వసూలు చేసినందుకు 15 శాతం నిర్వహణ వ్యయం రూ.13.86 కోట్లు పోను, జిల్లా గ్రంథాలయ సంస్థలకు రూ.79.87 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థలకు రూ.46.06 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.33.80 కోట్లు చెల్లించాల్సి ఉంది.