కరోనాతో పావులూరి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-05T08:39:44+05:30 IST

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస

కరోనాతో పావులూరి కన్నుమూత

ప్రముఖ సమరయోధుడు, గాంధీజీకి శిష్యుడు

గవర్నర్‌, చంద్రబాబు సంతాపం


గుంటూరు/అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మహాత్మాగాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. అనంతరం గాంధీజీకి శిష్యుడయ్యారు. తమిళనాడు మాజీ గవర్నర్‌, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆయనవద్ద విద్యనభ్యసించారు. పావులూరి ఏపీ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఏపీ పట్టు పరిశ్రమ సలహా సంఘం సభ్యుడిగా, ఏపీ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కావూరు వినయాశ్రమ ధర్మకర్తలమండలి సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. వార్దా సేవాగ్రామ్‌లో 1934లో ఏడాది పాటు గాంధీజీకి సేవలందించారు. క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్‌ జైలులో కారాగార శిక్ష అనుభించారు. 2018లో విశ్వహిందీ సమ్మేళనంలో భాగంగా రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చేతుల మీదగా విశిష్ట సన్మానం అందుకున్నారు. పావులూరికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 


ప్రముఖుల సంతాపం

పావులూరి శివరామకృష్ణయ్య మృతికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


నేటి తరం యువతకు స్ఫూర్తి ప్రదాత: బాబు

పావులూరి మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవకుడిగా, సంఘ సంస్కర్తగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకున్నారని కొనియాడారు. శివరామకృష్ణయ్య కుమారుడు కృష్ణకుమార్‌తో పాటు కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాజీ డిప్యూటి స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు తదితరులు కూడా పావులూరి మృతికి సంతాపం ప్రకటించారు.

Updated Date - 2021-05-05T08:39:44+05:30 IST