నక్సలిజం తగ్గింది.. మాఫియా పెరిగింది!
ABN , First Publish Date - 2021-12-30T08:29:34+05:30 IST
గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టిందని, అయితే లోకల్ మాఫియా పేట్రేగిపోతోందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
![నక్సలిజం తగ్గింది.. మాఫియా పెరిగింది!](https://media.andhrajyothy.com/appimg/galleries/192112300770/12302021025855n20.jpg)
- మాఫియాతో పోలీసుల కుమ్మక్కు
- ఇక సామాన్యుడికి భద్రత ఎక్కడ?
- ఆ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి
- ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు
వెంకటగిరి(టౌన్), డిసెంబరు 29: గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టిందని, అయితే లోకల్ మాఫియా పేట్రేగిపోతోందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి 9వ బెటాలియన్లో బుధవారం జరిగిన స్పోర్ట్స్మీట్లో ఎమ్మెల్యే ఆనం ప్రసంగించారు. ఈ లోకల్ మాఫియాతో కొందరు పోలీసులు చేతులు కలిపారంటూ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల్లో నమ్మకం భరోసా కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మాఫియా, పోలీసులు కలిస్తే రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. తాను పోలీసులందరినీ నిందించడం లేదని ఆ శాఖలో ఉన్న కలుపు మొక్కలను ఏరిపారేయాలని మాత్రమే చెబుతున్నానని, అప్పుడే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు.