అసెంబ్లీలో జరిగిన ఘటనపై తొలిసారి స్పందించిన Nara Bhuvaneshwari
ABN , First Publish Date - 2021-11-26T17:20:24+05:30 IST
శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు తొలిసారి స్పందించారు.
అమరావతి: శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు తొలిసారి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించి నిరసన తెలియజేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదు. ‘‘నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల.. నిరసన వ్యక్తం చేసినవారందరికీ ధన్యవాదాలు. అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లు భావించి.. అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి మా అమ్మానాన్న విలువలతో పెంచారు. నేటికీ మేం వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదు’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.