‘గంటా’ రాజీనామా వెనుక వ్యూహం ఉందా?

ABN , First Publish Date - 2021-02-06T22:10:32+05:30 IST

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘గంటా’ రాజీనామా వెనుక వ్యూహం ఉందా?

విశాఖ: విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన కొన్ని రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అలా అని ఆయన వైసీపీలోనూ చేరలేదు. ఎందుకంటే ఆయన రాకను విశాఖ వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు టీడీపీలో ఇమడలేక.. ఇటు వైసీపీలోకి వెళ్లలేక తటస్థంగా నిలబడ్డారు. ఇక ‘గంటా’ వైసీపీ గుడిలో మోగుతుందని టీడీపీ భావించినట్టు ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు... విశాఖ ఉత్తర నుంచి ఇద్దరికి ప్రధాన కార్యదర్శులుగా, ఒకరికి కార్యదర్శిగా పదవులు ఇచ్చారు. ఈ తరుణంలోనే అనూహ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటికరించేందుకు కేంద్రం సన్నాహకాలు ప్రారంభించింది. ‘వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా’ ఈ అవకాశాన్ని గంటా ఉపయోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజకీయ పండితులు చెబుతున్నారు. 


ఈ పరిణామాలతోనే ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెటర్ ప్యాడ్‌పై స్వయంగా రాసి, స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే గంటా రాజీనామా లేఖ ప్రస్తుతం హాట్‌టాపిక్ అవుతోంది. ఎందుకంటే రాజీనామా చేయాలంటే దానికి ఓ ఫార్మాట్ ఉంటుంది. లేఖలో ఎలాంటి కారణాలు చెప్పకూడదు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ ఒక్క వ్యాక్యం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కానీ గంటా మాత్రం తాను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అది సాంకేతికంగా చెల్లుబాటు కాదని నిపుణులు అంటున్నారు.


అయితే స్పీకర్ విచక్షాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. స్పీకర్ కార్యాలయానికి లేఖ అందిన తర్వాత... గంటాను స్పీకర్ ప్రత్యక్షంగా కలిసి, అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా రాజీనామాకు కట్టుబడి ఉంటే.. రాజీనామాను ఆమోదిస్తారు. లేదా అక్కడి వరకు అవసరం లేదనుకుంటే ఫార్మాట్‌లో లేని కారణంగా రాజీనామాను తిరస్కరించవచ్చు. అయితే గంటా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కావున,  ఉప ఎన్నిక కావాలని అధికార పార్టీ అనుకంటే స్పీకర్ విచక్షణాధికారంతో రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుందని గంటా అనుకున్నారో ఏమో గానీ.. తన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తైన తర్వాత ఆమోదించాలని కోరారు. అది ఇప్పుడు అంత త్వరగా జరిగే పనికాదు.  

Updated Date - 2021-02-06T22:10:32+05:30 IST