వంద పార్టీలు ఒకవైపు, జగన్ మరోవైపు: మంత్రి సీదిరి
ABN , First Publish Date - 2021-12-18T00:58:45+05:30 IST
రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో
శ్రీకాకుళం: రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద పార్టీలు ఒకవైపు, సీఎం జగన్ మరోవైపు ఉన్నారని ఆయన అన్నారు. జిల్లాలో మంత్రి మాట్లాడారు. రాజధాని అంటే భూములో, పరిపాలనో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రైతుల యాత్ర కేవలం భూముల కోసమేనన్నారు. రైతుల యాత్రను బినామీ యాత్రగా ఆయన అభివర్ణించారు. రాజధాని అమరావతి భూములు త్యాగం అంటున్నారని, అది అవాస్తవమన్నారు. ఈ భూములో 1/3 ల్యాండ్ బాగాన్ని డెవలప్ చేసి రైతులకు ఇస్తున్నామన్నారు. దళితుల భూములను అక్రమంగా లాక్కొని సొంత వాళ్లకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అమరావతి కేవలం ఐదువేల ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ అని ఆయన పోల్చారు. అమరావతి ఎవరి రాజధాని, ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి, అమరావతిలో పేదవారు ఉండగలరా అని ఆయన ప్రశ్నించారు. కార్ల్మార్క్స్ సిద్దాంతాలను వదలి ఏపీలో బూటకపు కమ్యూనిస్టులు తయారయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీకి పార్టీల మద్దతు కాదు ప్రజల మద్దతు కావాలన్నారు. వంద పార్టీలు ఒకవైపు, జగన్ మరో వైపు ఉన్నారన్నారు. జగన్ మెడలు వంచాలనుకున్నారని, కానీ ఎన్ని పార్టీలు ఏకమైనా ఏం పీకలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంధ్రీకరణ వైపు అడుగులేసామన్నారు. చంద్రబాబు మాటలు విని ఉత్తరాంధ్రలో ర్యాలీలు చేసిన వారు ఉత్తరాంద్ర ద్రోహులు, దొంగలు అని ఆయన అన్నారు.