కరోనా కంటే చంద్రబాబు ప్రమాదకారి: పేర్ని
ABN , First Publish Date - 2021-05-07T10:15:13+05:30 IST
కరోనా వైరస్ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్-440కె వైరస్ విజృంభిస్తుందంటూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తికి మించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అహర్నిశలూ పనిచేస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏపీలో కొత్త వైరస్ ఉందంటూ అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్440కె వైర్సపై ఎలాంటి నిర్ధారణ జరగలేదన్నారు. దేశంలో 8.1.617 మినహా కొత్తరకం వైరస్ ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు, రెమ్డిసివిర్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ భవిష్యత్తు కోసం కరోనానూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు భవిష్యత్తు కోసం రాష్ట్రంపై ఎందుకంత కక్షని చంద్రబాబును ప్రశ్నించారు. ‘అధికారంలో ఉండగా చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ పెట్టారా? ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నం చేశారా?’ అని పేర్ని ప్రశ్నించారు.