అన్నదాతల్ని ఆలయానికి వెళ్లనివ్వరా?: బీజేపీ
ABN , First Publish Date - 2021-10-29T09:03:10+05:30 IST
అన్నదాతల్ని ఆలయానికి వెళ్లనివ్వరా?: బీజేపీ
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులు తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి మీ అనుమతి కావాలా? అన్నదాతలు ఆలయానికి వెళ్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయా? అధికార వైసీపీ ర్యాలీలు చేపడితే అనుమతులు అక్కర్లేదా.. అంటూ పోలీసు శాఖపై బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతి రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో తిరుమలకు కాలినడకన వెళ్లడానికి పోలీసులు అనుమతి లేదనడం సరికాదని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి వల్లూరు జయప్రకాశ్ నారాయణ, లంకా దినకర్ పేర్కొన్నారు. హిందువులను ఆలయాలకు వెళ్లకుండా అడ్డుకోవడం మానుకోవాలని.. రైతులు, మహిళలపై ఆంక్షలు పెడితే బీజేపీ ఊరుకోబోదని చెప్పారు.
రైతుల పాదయాత్రకు సీపీఎం మద్దతు
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆపై మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని తెచ్చిందన్నారు. రాజధానిలో అభివృద్ధి స్తంభించిందని, వేలాది మంది ఉపాధి కోల్పోయారని, రాజధాని చిట్టడివిలాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు, ప్రజలు 680రోజులుగా ఆందోళన చేస్తున్నారని, న్యాయస్థానాలకు కూడా వెళ్లారని తెలిపారు. అమరావతి జేఏసీ చేపట్టిన పాదయాత్రకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.