‘అమ్మఒడి’ కావాలా..!.. ‘ల్యాప్టాప్’ కావాలా..!
ABN , First Publish Date - 2021-04-02T08:49:33+05:30 IST
నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం స్వరూపం మారుతోంది. 2019-20లో 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని...
- ఈనెల 22 నాటికి తల్లుల అభీష్టం తెలుసుకునే ప్రయత్నం
అమరావతి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం స్వరూపం మారుతోంది. 2019-20లో 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ ఏడాది అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమచేసింది. అందులో నుంచి మరుగుదొడ్ల నిర్వహణ కోసమంటూ రూ.1000 విరాళంగా తీసుకోవాలని చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇది కొంతమేర అమలైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో వెనక్కు తీసుకోవడం లేదని తెలుసుకున్న సర్కారు.. 2020-21లో తల్లుల బ్యాంక్ ఖాతాలో నేరుగా రూ.14 వేలు జమచేసి.. మిగిలిన రూ.1000 మరుగుదొడ్ల నిర్వహణ నిధికి బదలాయించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మరో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. 9-12 తరగతుల విద్యార్థుల తల్లులకు ‘అమ్మఒడి’ పథకం ద్వారా నగదుకు బదులు ల్యాప్టా్పలు అందించే దిశగా చర్యలు చేపడుతోంది. అమ్మఒడి పథకం ద్వారా నగదు కావాలో.. లేదంటే ల్యాప్టాప్ కావాలో తేల్చుకునే అవకాశాన్ని తల్లుల అభీష్టానికే వదిలేయాలని నిర్ణయించింది. వారి అభీష్టాన్ని తెలుసుకోవడం కోసం సీఎం జగన్ తల్లుల్ని ఉద్దేశించి రాసిన లేఖ ప్రతిని జతపరచి వాటి ద్వారా వారి నిర్ణయాన్ని తెలుసుకోవాలని సూచిస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ఆదేశాలిచ్చారు.
- 15లోగా ఆ లేఖలను ఎంఈవోల ద్వారా పాఠశాలలు, కళాశాలలకు అందించాలి.
- యాజమాన్యం తమ వద్ద 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు లేఖ సారాంశాన్ని వివరించాలి. విద్యార్థులు ఆ లేఖను ఇంటికి తీసుకెళ్లి తమ తల్లులు, లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని తిరిగి దాన్ని 22 నాటికి పాఠశాలలో అందజేయాలి.
- విద్యార్థులు ఇచ్చిన అంగీకార పత్రంలోని అంశాలను పాఠశాలలు, కళాశాలలు 26లోగా అమ్మఒడి వెబ్సైట్లో పొందుపరచాలి. అనంతరం ఆ అంగీకార పత్రాలను పాఠశాల, కళాశాల రికార్డుల్లో భద్రపరచాలి.