భూములిస్తే రోడ్డున పడేశారు!
ABN , First Publish Date - 2021-12-31T08:33:26+05:30 IST
భూములిస్తే రోడ్డున పడేశారు!

744వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, డిసెంబరు 30: ‘‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పడకేయించారు. ప్రజా రాజధాని అమరావతిని అటకెక్కించారు. గత ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధికి వేసిన ప్రణాళికలను చెరిపేశారు. నిత్యావసరాల ధరలు పెంచి, పేదవాడు బతకలేని స్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎంత నాశనం చేస్తారు’’ అని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారంతో 744వ రోజుకు చేరుకుంది. రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు నిలిపివేసి సీఎం జగన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం ఎంతో ఆవేదన, ఆగ్రహం కలిగస్తున్నాయన్నారు. భూములిస్తే అభివృద్ధి చేయటం చేత కాక రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు.