‘చవితి’కి మాత్రమే నిబంధనలు గుర్తొచ్చాయా..?
ABN , First Publish Date - 2021-09-08T03:05:33+05:30 IST
అమరావతి: వినాయకచవితి ఉత్సవాల విషయంలో మాత్రమే కొవిడ్ నిబంధనలు గుర్తొచ్చాయా.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు.. ఆయన సమాధానాలు ఇచ్చారు
అమరావతి: వినాయకచవితి ఉత్సవాల విషయంలో మాత్రమే.. ప్రభుత్వానికి కొవిడ్ నిబంధనలు గుర్తొచ్చాయా.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు.. ఆయన సమాధానాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, సభలకు కొవిడ్ నిబంధనలు గుర్తురాలేదా.. అని మండిపడ్డారు. వైసీపీ కుటుంబ సభ్యుల సంస్మరణ సభలకు నిబంధనలు వర్తించవా.. అంటూ దుయ్యబట్టారు. ఏ పని తలపెట్టినా ముందుగా గణపతిని వేడుకుని ప్రారంభిస్తామని గుర్తు చేశారు. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేశారని ఆరోపించారు.
దేశం మొత్తం కొలిచే రాముడి తల తీసేస్తే.. ఏమీ చేయలేకపోయారన్నారు. ప్రస్తుతం వినాయకచవితి వేడుకలు వద్దంటున్నారని చెప్పారు. వేడుకలకు ఇతర రాష్ట్రాలలో షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే.. ఇక్కడ ఎందుకు వద్దంటున్నారో.. అర్థం కావడం లేదని తెలిపారు. విగ్రహాలను అమ్మే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సమంజసం కాదని హితవుపలికారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశాలపై ఒకటికి రెండు సార్లు చర్చించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాల్సిందేనని పవన్కళ్యాణ్ డిమాండ్ చేశారు.