రేపు కర్నూలు జిల్లాలో జగన్ పర్యటన
ABN , First Publish Date - 2021-03-25T01:03:27+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం11.45 గంటలకు కర్నూలు ఎయిర్పోర్టు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం 12.12 గంటలకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరిస్తారు. 12.18 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం స్ధానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 12.22 గంటలకు కర్నూలు – విశాఖపట్టణం విమాన సర్వీస్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్లను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమాన్ని ముగించుకుని జగన్ తాడేపల్లికి వెళ్తారు.
అయితే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి..! ఈ పేరు వింటే దేశభక్తుల గుండె ఉప్పొంగుతుంది. రాయలసీమ పౌరుషానికి ప్రతీక ఈ రేనాటి వీరుడు. తెల్లదొరల దాష్టీకాన్ని ఎదురించి పోరాడిన తొలితరం యోధుడు ఆయన. సుమారు ఏడాదిపాటు ఈస్ట్ ఇండియా పాలకులను గడగలాడించాడు. ఆయన వీరోచిత గాథను తెలుగువారు ఎన్నిటికీ మరిచిపోరు. ఆయన పేరును ఓర్వకల్లు వద్ద ప్రారంభిస్తున్న కర్నూలు విమానాశ్రయానికి పెట్టాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు.