కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-05-21T21:30:27+05:30 IST
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్పై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 50 బెడ్స్, అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో ఖచ్చితంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉండాలన్నారు. 100 టన్నుల సామర్థ్యంతో ఆక్సీజన్ ప్లాంట్ పెడితే 20 శాతం ఇన్సెంటివ్ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయాలని, ఆ ఆస్పత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వీలైనన్ని వ్యాక్సిన్లు సేకరించాలని, రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికి భవిష్యత్తులో వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు. బ్లాక్ ఫంగస్ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్లు అన్నింటిలోనూ ప్రమాణాలు పాటించాలని సీఎం జగన్ సూచించారు.