చల్లా, బల్లి కుమారులకు ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-02-26T07:48:39+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తరఫున ఆరుగురు అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. కొద్ది నెలల కింద మరణించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు...

చల్లా, బల్లి కుమారులకు ఎమ్మెల్సీ

  • రామచంద్రయ్య, ఇక్బాల్‌, దువ్వాడ, కరీమున్నీసాలకు కూడా
  • వైసీపీ అభ్యర్థులను ఖరారుచేసిన సీఎం జగన్‌

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తరఫున ఆరుగురు అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. కొద్ది నెలల కింద మరణించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు అవకాశమిచ్చారు. గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కల్యాణచక్రవర్తిని శాసనమండలికి పంపుతామని ఇప్పటికే తాను మాటిచ్చిన విషయాన్ని జగన్‌ గుర్తుచేశారు. అదేవిధంగా చల్లా కుమారుడు భగీరథరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ చర్చకు వచ్చింది. శాసనమండలి నుంచి అర్ధాంతరంగా రిటైరవుతున్నవారికి మరో చాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించినందున మహమ్మద్‌ ఇక్బాల్‌కు మరోసారి పొడిగింపు ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్నీ సీఎం ప్రస్తావించారు. వీరుగాక పార్టీలో చేరిన సి.రామచంద్రయ్యకు కూడా ఎమ్మెల్సీ పదవిని ఖరారుచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. కింజరాపు రామ్మోహన్‌నాయుడి చేతిలో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాసరావుకూ ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. మైనారిటీలను ఆకర్షించడంలో భాగంగా ఆ నగరానికి చెందిన కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్‌ నిర్ణయించారు. సమావేశంలో ఖరారుచేసిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు.


Updated Date - 2021-02-26T07:48:39+05:30 IST