జగన్ గాలి రాజకీయం!
ABN , First Publish Date - 2021-11-26T23:25:20+05:30 IST
ఆయన నింగిలోనే విహరిస్తారు. నేల మీద ఉన్న వారిని చూసి చులకన భావాన్ని ప్రదర్శిస్తారు. ప్రజలకు అందనంత దూరంగా ఉంటారు.

అమరావతి: ఆయన నింగిలోనే విహరిస్తారు. నేల మీద ఉన్న వారిని చూసి చులకన భావాన్ని ప్రదర్శిస్తారు. ప్రజలకు అందనంత దూరంగా ఉంటారు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నేతలను చూసి ఎగతాళి చేస్తారు. మాటలతో కాలయాపన చేస్తారు. జనం కోసం పనిచేసే నేతలను చూసి వికటాట్టహాసం చేస్తారు. ఆయనే ఏపీ సీఎం జగన్.
జగన్ అసెంబ్లీలో ఉపన్యాసాలిస్తారు. క్షేత్రస్థాయిలో జనం బాధలను పట్టించుకోరు. ప్రత్యర్థులు ఒక మాట అంటే పది తిట్లతో జవాబిస్తారు. ఆయనకు కోరస్గా బూతుల మంత్రులు ఉండనే ఉంటారు. జనం కోసం జనంలో తిరుగుతూ జనం బాధలను అర్థం చేసుకున్న విపక్షాలు ప్రజల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా కౌంటర్ అటాక్తో వారి నోరు మూయించేందుకు ప్రయత్నం చేస్తారు. వరద నష్టంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనంలోకి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పాల్సిన నేత కళ్లబొల్లిమాటలు.. కాకి లెక్కలతో అసలు విషయాన్ని హైజాక్ చేశారనే అభిప్రాయం కలుగుతోంది.
జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. వరదల సాయంపై చాలా సేపు ప్రసంగించారు. అందులో సింహభాగం సభలోని విపక్షాలపై బురద ఎత్తపోసేందుకే వెచ్చించారు. చంద్రబాబుపైనా.. టీడీపీ ఎమ్మెల్యేలపైనా కయ్యికయ్యిమని ఎగిరారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వేతో సరిపెట్టారని గుర్తుచేసిన పాపానికి చంద్రబాబును ఏకంగా విలన్ను చేసేందుకు జగన్ ప్రయత్నించారు.