సీఎస్ ఆదిత్యనాథ్ను కావాలనే అవమానించారా!... జగన్ మనసులో ఏముంది?
ABN , First Publish Date - 2021-09-12T23:01:32+05:30 IST
ఏపీ కొత్త సీఎస్ నియామకానికి సంబంధించి జగన్ సర్కార్ అనుసరించిన వైఖరి విమర్శలకు దారి తీస్తోంది.
అమరావతి: ఏపీ కొత్త సీఎస్ నియామకానికి సంబంధించి జగన్ సర్కార్ అనుసరించిన వైఖరి విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని అత్యంత అగౌరవ రీతిలో సాగనంపుతుండటం.. ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ను అవమానించడానికే ఇలా చేశారంటూ అధికార వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.... అంటే, మొత్తం అధికార యంత్రాంగానికి బాస్! అలాంటి పదవిలో ఉన్న వ్యక్తికి రెండోసారి పొడిగింపు అవకాశం ఉన్నా ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏమాత్రం గౌరవ మర్యాదలు పాటించకుండా మీదే ఆలస్యం. ఇక వెళ్లిపోవచ్చు అనే సంకేతాలు పంపించారు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం మరో 20 రోజులు మిగిలి ఉండగానే కొత్త సీఎస్గా సమీర్ శర్మను నియమించారు. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్గా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. కానీ... ఆదిత్యనాథ్ దాస్ విషయంలో సర్కారు వ్యవహరించిన తీరు అధికార వర్గాలను విస్మయపరుస్తోంది. ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని గతంలో ఒకసారి 3నెలలపాటు పొడిగించారు. ఆ గడువు నెలాఖరుతో ముగుస్తుంది. మరో 3నెలలు ఆయనను కొనసాగించాలని సీఎం కోరవచ్చు. కేంద్రం అనుమతిస్తుంది కూడా. అంతకు ముందు సీఎస్గా ఉన్న నీలం సాహ్ని పదవీ కాలాన్ని రెండు దఫాలుగా పొడిగించారు. అంతకుమించి సాధ్యం కాకపోవడంతో ఆమెను ఎస్ఈసీ పోస్టులో సగౌరవంగా కూర్చోబెట్టారు.
ఆదిత్యనాథ్ దాస్కు రెండో విడత కొనసాగింపు కోరలేదు సరికదా, పదవీ విరమణకు 20రోజుల ముందే ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తూ జీవో జారీ చేశారు. ఇప్పటివరకు వస్తున్న సంప్రదాయం ప్రకారం సీఎస్ పదవీ విరమణ రోజున లేదా ఒక్కరోజు ముందుగా మాత్రమే కొత్త సీఎస్ నియామకపు ఉత్తర్వులు జారీ అవుతాయి. కొత్త సీఎస్గా ఎవరు ఉండాలో సీఎం ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆ మేరకు అధికారులకు కూడా సమాచారం ఉంటుంది. కానీ, జీవో మాత్రం చివరిరోజే ఇస్తారు. అది సర్వీసులో ఉన్న ఆ అధికారికి ఇచ్చే గౌరవం. కానీ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ముగియకుండానే... కొత్త సీఎస్గా సమీర్ శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.