కొండపల్లి ఎన్నికపై విచారణ 29కి వాయిదా
ABN , First Publish Date - 2021-11-26T09:35:40+05:30 IST
కొండపల్లి ఎన్నికపై విచారణ 29కి వాయిదా

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా కొండపల్లి పురపాలక చైౖర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ గురువారం ఆదేశాలిచ్చారు. అంతకుముందు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన విడియో, ఇతర వివరాలను ఎన్నికల అధికారి కోర్టు ముందు ఉంచారు. వ్యాజ్యంపై విచారణ వాయిదా పడిన నేపథ్యంలో వాటిని రిటర్నింగ్ అధికారి వద్దే ఉంచాలని ఆదేశించారు. ఎన్నిక ఫలితాన్ని ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు అర్హత విషయంలో దాఖలైన వ్యాజ్యం కూడా 29కి వాయిదా పడింది.