విశాఖ ‘ఉక్కు’ పోరులో..జగనే ముందుండాలి

ABN , First Publish Date - 2021-07-24T07:40:39+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భాగస్వామ్యం తీసుకుని దానికి నాయకత్వం వహించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు

విశాఖ ‘ఉక్కు’ పోరులో..జగనే ముందుండాలి

ఆయనే నాయకత్వం వహించాలి

అందరూ కలిసివస్తే రాజీనామాలకు టీడీపీ ప్రజాప్రతినిధులు సిద్ధం

సంఘటిత పోరాటంతోనే ప్రైవేటీకరణ ఆపగలం

వాజపేయి హయాంలోనూ ఈ ప్రతిపాదన వచ్చింది

నా విజ్ఞప్తితో పక్కనపెట్టింది

పరిరక్షణ సమితికి చంద్రబాబు లేఖ


అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భాగస్వామ్యం తీసుకుని దానికి నాయకత్వం వహించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఆయన శుక్రవారం లేఖ రాశారు. ‘మీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి వ్యక్తిగతంగా నా మద్దతు, మా పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటాయి. అందులో మారో మాటే లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం తీసుకుని. ముందు వరసలో నిలిచి నాయకత్వం వహించాలి. అందరూ కలిసి వస్తే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి అవసరమైతే రాజీనామాలకు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మనందరి సమష్టి పోరాటం మాత్రమే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఆపగలదు’ అని అందులో పేర్కొన్నారు. మద్దతు కోరుతూ పోరాట కమిటీ కన్వీనర్‌ రాసిన లేఖకు ప్రతిస్పందనగా చంద్రబాబు ఈ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నిరంతరాయంగా సంఘటితంగా పోరాట సమితి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘1960ల ప్రాంతంలో తెలుగు ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేసిన భారీ ఉద్యమం ఫలితంగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రానికి సిద్ధించింది.


కానీ 2000వ సంవత్సరం నాటికి దాని నష్టాలు రూ.4 వేల కోట్లకు చేరాయి. దీంతో అప్పటి వాజపేయి ప్రభుత్వం దీనిని ప్రైవేటుపరం చేయాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కానీ అప్పుడు రాష్ట్రప్రభుత్వం తరఫునా.. అలాగే వ్యక్తిగతంగా నా తరఫునా విజ్ఞప్తి చేయడంతో ప్రైవేటీకరణ ప్రతిపాదన పక్కన పెట్టింది. ఈ ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రూ.1,333 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా ఫ్యాక్టరీ లాభాల బాట పట్టింది. ఈ అనుభవం నేపఽథ్యంలో ఇప్పుడు కూడా జగన్‌ ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఒత్తిడి కేంద్రంపై ఏర్పడాలి. అప్పుడే దీనిని ప్రభుత్వ రంగంలో కొనసాగించగలుగుతాం’ అని  లేఖలో స్పష్టంచేశారు.

Updated Date - 2021-07-24T07:40:39+05:30 IST