రాజధాని తరలిస్తే సీమకే అన్యాయం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-12-19T08:45:03+05:30 IST
రాజధాని తరలిస్తే సీమకే అన్యాయం: తులసిరెడ్డి
![రాజధాని తరలిస్తే సీమకే అన్యాయం: తులసిరెడ్డి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121903135667/12192021031455n57.jpg)
వేంపల్లె, డిసెంబరు 18: అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ వాసులేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం కడప జిల్లా వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఉన్న సచివాలయానికి వెళ్లాలంటేనే రాయలసీమ వాసులకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుందని తెలిపారు. ఇక విశాఖకు తరలిస్తే సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు మరింత దూరమవుతుందన్నారు. విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణించే పెద్ద నాయకులకు, కుబేరులకు ఇబ్బంది ఉండకపోవచ్చునని, సాధారణ ప్రజానీకానికి సమస్యలు ఉంటాయన్నారు. వికేంద్రీకరణ బిల్లు లేకుండానే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు బదిలీచేసి అధికార వికేంద్రీకరణ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా, పరిశ్రమలు, ప్యాకేజీలో ప్రకటించిన విధంగా నిధులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు.