కారుణ్య మరణం కోరుకుంటే..విషాదాంతమే మిగిలింది!!

ABN , First Publish Date - 2021-06-02T09:37:38+05:30 IST

జబ్బు చేసిన బిడ్డను బతికించుకోవడానికి ఆ నిరుపేద తల్లిదండ్రులు అష్టకష్టాలు పడ్డారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చుచేసినా..

కారుణ్య మరణం కోరుకుంటే..విషాదాంతమే మిగిలింది!!

జబ్బు చేసిన బిడ్డకు కారుణ్య మరణం కోసం కోర్టుకెళ్లిన తల్లి

సెలవని తెలిసి నిరాశగా వెనక్కి.. మార్గమధ్యంలోనే బిడ్డ మృతి

కొడుకు అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఇల్లు విడిచిన తండ్రి

ఆదుకోని ఆరోగ్యశ్రీ.. చౌడేపల్లె మండలం బీర్జేపల్లిలో విషాదం


చౌడేపల్లె, జూన్‌ 1: జబ్బు చేసిన బిడ్డను బతికించుకోవడానికి ఆ నిరుపేద తల్లిదండ్రులు అష్టకష్టాలు పడ్డారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చుచేసినా.. మాయదారి రోగం తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టింది. దీంతో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్ప మరో మార్గం లేదని వైద్యులు సైతం చేతులెత్తేశారు. పెద్దాసుపత్రిలో ఈ ఆపరేషన్‌ చేయాలంటే లక్షల ఖర్చవుతుంది. ఈ దశలో ఆరోగ్యశ్రీ పథకమూ వారిని ఆదుకోలేదు. అప్పటికే అప్పులపాలైన తండ్రికి మతి చలించి ఎటో వెళ్లిపోయాడు. దారీతెన్నూ తోచని పేద తల్లి అపస్మారక స్థితిలో ఉన్న పదేళ్ల బిడ్డతో కోర్టు మెట్లు ఎక్కింది. బతికించుకునే శక్తి లేనందున బిడ్డను చంపుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ వేడుకుందామని వెళ్తే సెలవుల కారణంగా కోర్టు మూతపడింది. నిస్సహాయంగా ఇంటికి వెనుదిరిగి వెళుతుండగానే ఆ బిడ్డ తల్లి ఒడిలోనే కన్నుమూశాడు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


చౌడేపల్లె మండలం చారాల పంచాయతీ బీర్జేపల్లెలో ఉన్నదంతా వడ్డెర కుటుంబాలే. అంతా నిరుపేదలు. ఊరి పక్కనే ఉన్న బండపై రాళ్లు కొట్టుకుని గుల్ల అమ్ముకోవడమే బతుకుదెరువు. ఆ కుటుంబాల్లో ఒకటైన మణి, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి పదేళ్లు కాగా చిన్నవాడికి పది నెలలు. పెద్ద కొడుకు హర్షవర్ధన్‌ నాలుగేళ్ల కిందట ఇంటి మిద్దెపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. ప్రమాదంలో తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలోనూ, వేలూరు సీఎంసీ వైద్యశాలలోనూ చికిత్స చేయించారు. వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా అప్పులైనా బిడ్డ కోలుకున్నాడు అదే చాలని ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగుందనుకునేలోపే నెల కిందట పిల్లవాడికి అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. నోరు, ముక్కు వెంట రక్తస్రావం మొదలైంది. తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్తే ఇక్కడ చేయగలిగింది లేదని, ఏదైనా పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయిస్తే ఉపయోగం ఉంటుందని వైద్యులు సూచించారు. పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. 


గతంలో ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనుభవాలు, లక్షల్లో అయిన అప్పులు కళ్ల ముందు మెదలాడుతుండగానే.. కొత్తగా వచ్చిపడిన సమస్యతో తండ్రి మణి మతి స్థిమితం కోల్పోయాడు. పదిహేను రోజుల కిందట ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు భర్త ఇల్లు వదిలిపెట్టడంతో అరుణ మానసికంగా కంగిపోయింది. నిస్సహాయ స్థితిలో తన బిడ్డను కారుణ్య మరణం పేరిట చంపుకునేందుకు అనుమతివ్వాలని కోర్టుని వేడుకోవాలని భావించింది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తీసుకుని మంగళవారం పుంగనూరు బయల్దేరింది. తీరా అక్కడుకు వెళ్లాక కోర్టుకు సెలవులని సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరిగింది. కానీ.. ఇంటికి చేరకునే లోపే హర్షవర్ధన్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బీర్జేపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. అరుణ కుటుంబ పేదరికం, నిస్సహాయత ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను మాత్రం కదిలించలేకపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-02T09:37:38+05:30 IST