సీనియర్‌ ఐఏఎస్‌‌ను వైసీపీ సర్కార్ ఎందుకు మార్చేసింది!?

ABN , First Publish Date - 2021-02-14T18:08:20+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో

సీనియర్‌ ఐఏఎస్‌‌ను వైసీపీ సర్కార్ ఎందుకు మార్చేసింది!?

చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ జైన్‌ను ప్రభుత్వం ఒక్కసారిగా మార్చేసింది. దీంతో ఆయన మార్పునకు కారణాలు ఏంటని జిల్లా అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర సర్వేశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జైన్‌ను జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రీసర్వే నడుస్తోన్న క్రమంలో జైన్‌ సేవల అవసరం ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో అతన్ని పరిశీలకుడి బాధ్యతల నుంచి తప్పించి రీసర్వే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది. దీంతో జైన్‌ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ను నియమిస్తూ ఎస్‌ఈసీ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జైన్‌ శుక్రవారమే రిలీవ్‌ కాగా.. నవీన్‌కుమార్‌ శనివారం జిల్లాకు వచ్చారు. రెండో దశ పోలింగ్‌ జరుగుతున్న ఎర్రావారిపాలెం మండలంలో ఆయన పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - 2021-02-14T18:08:20+05:30 IST