అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
ABN , First Publish Date - 2021-03-02T09:22:01+05:30 IST
తిరుపతిలో ఈ నెల 4, 5 తేదీల్లో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన అనూహ్యంగా రద్దయింది. దక్షిణాది రాష్ర్టాల సీఎంలు హాజరయ్యే ఈ
న్యూఢిల్లీ/అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఈ నెల 4, 5 తేదీల్లో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన అనూహ్యంగా రద్దయింది. దక్షిణాది రాష్ర్టాల సీఎంలు హాజరయ్యే ఈ కీలకమైన సమావేశం రద్దు కావడంతో.. తిరుపతిలో 5న జరగాల్సిన బీజేపీ రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీని కూడా ఆ పార్టీ అధినాయకత్వం వాయిదా వేసుకుంది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సదస్సును రద్దు చేయడమే ఉత్తమమని కేంద్ర హోం శాఖ భావించింది. ఇంకోవైపు.. అమిత్ షా కూడా ఎన్నికల వ్యూహరచనలో తలమునకలై ఉన్న విషయం తెలిసిందే.
తిరుపతి అభ్యర్థి తేలేది ఎప్పుడు?
నిజానికి అమిత్ షా తిరుపతి పర్యటనను బీజేపీ రాష్ట్ర నేతలు కీలక పరిణామంగా భావించారు. పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పేరుగడించిన ఆయన.. ఎక్కడ పర్యటించినా అక్కడ కమలవికాసం ఖాయమన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే.. తామే బరిలో ఉంటామంటూ మిత్రపక్షమైన జనసేన స్పష్టం చేస్తోంది. ఈ పంచాయతీ ఇంకా తేలకముందే. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ ఖాయమని ప్రచారం జరిగింది. ఇప్పుడు పర్యటన రద్దు కావడంతో.. ఉప ఎన్నిక బరిలో నిలిచేదెవరన్న విషయమై అనిశ్చితి నెలకొంది.