చనిపోయిన 20 రోజులకి స్వదేశానికి
ABN , First Publish Date - 2021-02-01T08:38:35+05:30 IST
కాకినాడ వాస్తవ్యుడు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు.

- వీసాలో ఒక సంస్థ.. మరోచోట పనిచేస్తూ మృతి
- కఠిన నిబంధనలతో పోలీసు విచారణ ఆలస్యం
- ఎట్టకేలకు స్వదేశానికి కాకినాడ ప్రవాసీ మృతదేహం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): కాకినాడ వాస్తవ్యుడు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. చేస్తున్న ఉద్యోగానికి తోడు పార్ట్ టైంగా మరొక చోట పనిచేస్తే నాలుగు దిర్హాంలు వెనకేసుకుని ఆర్థిక కష్టాలను అధిగమించొచ్చని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే పార్ట్టైమ్ జాబ్ చేస్తూ షార్జాలో మృత్యువాతపడ్డాడు. వీసాలో చూపిన సంస్థలో కాకుండా వేరొకచోట పనిచేస్తూ చనిపోవడం, కఠినమైన వీసా నిబంధనల కారణంగా అతని మృతదేహం స్వదేశానికి పంపడానికి 20 రోజులు పట్టింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన వానపల్లి శ్రీనివాస్ (39) దుబాయ్లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగంతో పాటు దుబాయ్, షార్జా నగరాల్లోని వివిధ పరిశ్రమల్లోనూ పార్ట్ టైంగా కొన్ని పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం ఒక సంస్థలో ట్యాంకులు మరమ్మతులు చేసేందుకు వెళ్లి అక్కడ వెలువడిన విషవాయువల కారణంగా ఊపిరాడక చనిపోయాడు. దుబాయ్లోని ఎన్నారై కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి సమన్వయంతో శ్రీనివాస్ చనిపోయిన 20 రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని శనివారం స్వదేశానికి పంపించారు.