Guntur: నా భార్య బతికే ఉందో లేదో తెలియదు : యువకుడి ఆవేదన
ABN , First Publish Date - 2021-07-23T18:19:01+05:30 IST
జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రిగకు చెందిన చందు, బేతపూడికి చెందిన కౌసర్. ఈ నెల 19న గుంటూరులోని శేషాచలం ఆశ్రమంలో ఈ వివాహం జరిగింది. పెద్దల నుంచి తమకు ఇబ్బందులు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిగకు చెందిన చందు.. కౌసర్ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను కలిసిన కొద్దిసేపటికే ఆటోలో వెళుతున్న ఈ జంటపై దాడి చేసి కౌసర్ను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారు. ఈ విషయంపై చందు మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ఒత్తిళ్ళతో పోలీసులు కిడ్నాప్ కేసు పట్టించుకోవటం లేదు. నా భార్య బతికి ఉందో లేదో తెలియదు. నాలుగురోజులైనా ఫిరంగిపురం పోలీసులు కనీస సమాచారం ఇవ్వడం లేదు. నా భార్య కోసం న్యాయ పోరాటం చేస్తా.. లేదంటే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ స్పందించి న్యాయం చేయాలి’’ అని కోరాడు.
కాగా.. ఈ నెల 19న గుంటూరులోని శేషాచలం ఆశ్రమంలో చందు, కౌసర్ల ప్రేమ వివాహం జరిగింది. పెద్దల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని ఈ ప్రేమికులు జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించమని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిరంగి పురం పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి నచ్చజెప్పారు. పోలీసులు నచ్చజెప్పిన కొద్దీసేపటికే చందు దంపతులు పోలీస్ స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా యువతి తరపు బంధువులు దాడి చేసి వధువును అపహరించారు.