అనవసర విషయాల్లోకి దేవాలయాలను తీసుకొస్తున్నారు: ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2021-01-13T18:43:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌‌లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ ..

అనవసర విషయాల్లోకి దేవాలయాలను తీసుకొస్తున్నారు: ఏపీ డీజీపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తోందన్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయన్నారు. 


తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించింది. ఏపీలో గత సెప్టెంబరు 5 నుంచి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామన్నారు. అంతేకాకుండా  43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు  80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను/ ముఠాలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం  దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వేల 256 గ్రామ రక్షణ దళాలకుగాను, 15వేల 394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. 




తప్పుడు ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  మన రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తులో ఉన్న అన్ని కేసులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు సిట్‌‌ను ఏర్పాటు చేశామన్నారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్  ప్రయోగిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంవో అఫెండర్స్‌ను ఇప్పటికే గుర్తించామన్నారు. వారందరినీ కూడా జియో మ్యాపింగ్‌తో అనుసంధానం చేశామన్నారు. వీరిపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్‌‌ను ఓపెన్ చేస్తామన్నారు.


రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో  దేవాలయాలకు/ పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు.  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిదన్నారు. అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు,  గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి ఇది. మనందరి బాధ్యత. మీ అందరి సహకారంతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకుందాం. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే.. తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్, దేవాలయాలకు సంభందించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9392903400 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుంది’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2021-01-13T18:43:05+05:30 IST