సరకు రవాణాపై దృష్టి: గుంటూరు రైల్వే డీఆర్ఎం
ABN , First Publish Date - 2021-04-09T23:27:52+05:30 IST
కరోనా కారణంగా రైల్వేకు ప్రయాణికుల ఆదాయం లేకపోవడంతో సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి
గుంటూరు: కరోనా కారణంగా రైల్వేకు ప్రయాణికుల ఆదాయం లేకపోవడంతో సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి సారించామని గుంటూరు రైల్వే డీఆర్ఎం మోహనరాజుతెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమస్య ఉన్నా గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 370కోట్ల ఆదాయం ఉంటే ఈసారి 473 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. సరకు రవాణా గతేడాదితో పోలిస్తే రెట్టింపయిందని ఆయన పేర్కొన్నారు.
గూడ్స్ ఆదాయం 193కోట్ల నుంచి 427కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. సరకు రవాణా 1.55 మిలియన్ టన్నుల నుంచి 2.49 మిలియన్ టన్నులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. బియ్యం, మిర్చి, జొన్న, సిమెంట్ ముడిసరకు రవాణా ఎక్కువగా జరుగుతోందని ఆయన వివరించారు.