వినుకొండలో రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-03-27T21:25:03+05:30 IST
పోలీస్ స్టేషన్లోకి తనను తీసుకెళ్లారనే మనస్థాపంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఓ
గుంటూరు: పోలీస్ స్టేషన్లోకి తనను తీసుకెళ్లారనే మనస్థాపంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన వినుకొండలో చోటుచేసుకుంది. ఎర్రబోతుల వీరాంజనేయులు అనే రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఎండలు పెరగడంతో పంటలకు నీళ్లు సరిపోవడం లేదు. అయితే చెరువులను నింపడానికి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి నీటిని వదిలారు. పొలంను కాపాడుకోవడానికి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి పొలానికి వీరాంజనేయులు నీళ్లు పెట్టుకుంటున్నాడు.
విషయం అధికారులకు తెలిసింది. చెరువులను నింపడానికి వదిలిన నీళ్లను పొలానికి ఎందుకు పెట్టుకున్నావంటూ రైతు వీరాంజనేయులును మున్సిపల్ అధికారులు మందలించారు. దీంతో రైతుకు, మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
అక్రమంగా ఎన్ఎస్పీ కెనాల్ నుంచి నీటిని వాడుకుంటున్నాడని పోలీసులకు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రైతు వీరాంజనేయులును పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అనంతరం రైతును వదిలిపెట్టారు. తనను స్టేషన్కు పోలీసులు తీసుకెళ్ళడంతో మనస్థాపానికి గురై పొలంలోనే పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరాంజనేయులును కుటుంబ సభ్యులు ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.