పక్కాగా ‘నకిలీ’!

ABN , First Publish Date - 2021-04-18T08:03:44+05:30 IST

ఒకరి ఓటును మరొకరు వేయడం! కుదిరితే, ఒక్కరే రెండో ఓటు వేయడం! ఓ పది మంది క్యూలో నిలబడి ‘సైక్లింగ్‌’ పద్ధతిలో మళ్లీ మళ్లీ ఓటు వేయడం!... పోలింగ్‌లో అక్రమాలు పలు రకాలు! కానీ... శనివారం తిరుపతి

పక్కాగా ‘నకిలీ’!

దొంగ ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ

మృతులు, వలసపోయిన వారి పేర్లతో కార్డులు

నకిలీ ఓటర్లను చేర్చి వారి పేరిటా తయారీ

తమకు ఓటేయరనుకున్న వారి పేరుతోనూ..

పకడ్బందీగా సాగిన ‘దొంగ ఓట్ల దండయాత్ర’

తిరుపతిని ఎంచుకోవడానికీ ప్రత్యేక కారణాలు

వ్యూహాత్మకంగా సాగిన ‘దొంగ ఓట్ల దండయాత్ర’


తిరుపతి (రవాణా), ఏప్రిల్‌ 17: ఒకరి ఓటును మరొకరు వేయడం! కుదిరితే, ఒక్కరే రెండో ఓటు వేయడం! ఓ పది మంది క్యూలో నిలబడి ‘సైక్లింగ్‌’ పద్ధతిలో మళ్లీ మళ్లీ ఓటు వేయడం!... పోలింగ్‌లో అక్రమాలు పలు రకాలు! కానీ... శనివారం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జరిగింది కనీవినీ ఎరుగని అక్రమం! ఇతర ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో జనాలను తరలించారు. నకిలీ ఓటరు ఐడీ కార్డులను సృష్టించారు. ఈ క్రమంలో వలంటీర్ల సేవలను ‘సమర్థంగా’ వాడుకున్నారు. విపక్ష నేతల పరిశీలన, ఇతర వర్గాల సమాచారం ప్రకారం తిరుపతిపై దొంగ ఓటర్ల దండ యాత్ర ఎలా సాగిందంటే... 


అసలే ఉప ఎన్నిక! పైగా... ఎండాకాలం! అందులోనూ... నగరాల్లో పోలింగ్‌ శాతం తక్కువగానే నమోదవుతుంది. అందుకే... ‘దండ యాత్ర’కు తిరుపతి నగరాన్ని ఎంచుకున్నారు. ఇది పుణ్యక్షేత్రం కావడంతో వచ్చింది యాత్రికులే అని, వారితో తమకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు కూడా! ఇలా కొన్ని రోజుల ముందు నుంచే పక్కా వ్యూహం రచించారు. శనివారం పోలింగ్‌లో బయటపడ్డ నకిలీ ఓటరు ఐడీ కార్డుల్లో మూడు రకాలు కనిపించాయి. అవి...


ఓటర్ల నమోదులోనే ‘నకిలీ’

ఒకటి... ఒక పథకం ప్రకారం తప్పుడు చిరునామాలు, నకిలీ పేర్లతో ముందుగానే అనేక ఓట్లను నమోదు చేయించారు. వాటి పేర్లతో తామే ఓటరు గుర్తింపు కార్డులను సృష్టించారు. వాటి మీద తాము ముందుగా ఎంచుకున్న వ్యక్తుల ఫొటోలను ముద్రించారు. అవే కార్డులతో దొంగ ఓటర్లు ఎంచక్కా ఓటు వేశారు. నిజానికి ఆ పేర్లతో, ఆ వ్యక్తులెవరూ ఆ చిరునామాల్లో ఉండరు. ఓటరు కార్డు పక్కాగా ఉండడం, వారికి ఓటరు స్లిప్‌ కూడా ఇవ్వడంతో ఓటేసే సమయంలో అభ్యంతరం చెప్పే వాళ్లు కూడా లేకుండా పోయారు.


లేని ఓటర్లతో ఓటు...

ఇక... రెండో రకం కార్డులు చనిపోయిన వారి పేర్లు, ప్రస్తుతం ఆ చిరునామాల్లో నివాసం లేని వారి పేర్లతో తయారు చేశారు. ఇందుకు అధికార పార్టీకి వలంటీర్లు సంపూర్ణంగా సహకరించారు. తమ పరిధిలో ఉన్న 50-100 ఇళ్లలో చనిపోయిన, మరో చోటికి వెళ్లి స్థిరపడిన ఓటర్ల వివరాలను వలంటీర్ల ద్వారా సేకరించారు. వారికి చెందిన స్లిప్‌లను తీసుకుని... నకిలీ ఓటరు కార్డులు సృష్టించి దొంగ ఓట్లు వేయించారు. 


అసలుకే... నకిలీ!

మూడో రకం నకిలీ కార్డులు మరింత వినూత్నం! విపక్షాలకు పడే ఓట్లను తగ్గించడమే దీని లక్ష్యం. ‘వీళ్లు వైసీపీకి ఓటు వేసే అవకాశం లేదు’ అని నిర్ధారణకు వచ్చిన వారి పేరిట నకిలీ ఓటరు కార్డులు సృష్టించారు. వలంటీర్లు, స్థానిక వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారంతోపాటు పేరు చివర కులాన్ని సూచించే పదాల ఆధారంగా ‘ప్రత్యర్థి ఓటర్ల’ను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి నకిలీ ఓటర్లు శనివారం ఉదయం పోలింగ్‌ మొదలైన గంటలోనే... అంటే, అసలు ఓటరుకంటే ముందే ఓటు వేసిపోయారు. ఆ తర్వాత అసలు ఓటరు వచ్చి లబోదిబోమన్నా ఉపయోగం లేకపోయింది.


తడబాటుకు కారణం...

‘మిమ్మల్ని తిరుపతికి తీసుకెళతాం. మేము ఇచ్చిన ఓటరు కార్డు, స్లిప్పుతో క్యూలో నిలబడండి. ఓటు వేసి వచ్చేయండి’ అంటూ జనాలను తరలించారు. అదేవిధంగా చేశారు. దొంగ ఓటర్లెవరూ తమకు ఇచ్చిన స్లిప్‌లోని పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు చూసుకోలేదు. దీంతో... విపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. 


వీరంతా ఎవరు?

ఈ జాబితా చూడండి! వీరంతా ఏపీ 03 టీఈ 1515 బస్సులో వచ్చిన ‘దొంగ ఓటర్లు’. చౌడేపల్లి ఎంపీటీసీ ‘ఆధ్వర్యం’లో వీరంతా తరలి వచ్చినట్లు చక్కగా రాసి ఉంది. చౌడేపల్లి గ్రామం పుంగనూరు నియోజకవర్గంలోనిది. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి రాదు! ఈ జాబితా ఏమిటి, వీరంతా బస్సులో తిరుపతికి ఎందుకు వచ్చారు?


ఇక్కడ లేరు...

దొంగ ఓటర్లు పడేసిపోయిన గుర్తింపు కార్డుల్లోని చిరునామాలకు వెళ్లి పరిశీలించగా...


ఈ అడ్రస్సులో లేనే లేరు 

తిరుపతి అశోక్‌నగర్‌ డోర్‌ నెంబర్‌ 18-2-102బి-ఆర్సీ2 అనే చిరునామా... ఓటరు పేరు పి.మురళీధర్‌ రెడ్డి! ఈ గుర్తింపు కార్డుతో ఒక వ్యక్తి ఓటువేసేందుకు ప్రయత్నించాడు. అది నకిలీ ఓటరు ఐడీ కార్డు అని భావించి కొందరు ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో అతను కార్డును పడేసి పరుగులు తీసాడు. ఆ కార్డులోని చిరునామాకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వెళ్లి ఆరా తీయగా... అక్కడ మురళీధర్‌ రెడ్డి అనేవారు ఎవ్వరూ లేరని తేలింది. ఆ చిరునామాలో ఒక ముస్లిం కుటుంబం నివసిస్తోంది.


పేరు నాదే... కార్డు ఫేక్‌!

రాఘవ కిరణ్‌ మురారి అనే పేరుతో ఓటేయడానికి వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో... అతను కార్డు వదిలేసి పారిపోయాడు. ఆ కార్డుపై... 20-50-ఎస్‌ 2-310-201-1 ధృవ కైలాసం మారుతీ నగర్‌, కొర్లగుంట, తిరుపతి అనే చిరునామా ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు అక్కడికి వెళ్లగా... ఓటరు కార్డు మీద ఫొటో ఉన్న మురారి నిజంగానే అక్కడ నివసిస్తున్నారు. తన ఓటరు కార్డు తన వద్దే ఉందని, ఉదయాన్నే ఓటు వేసి వచ్చానని చెప్పారు. కార్డును కూడా చూపించారు. తన పేరు, ఫొటో, చిరునామాతో తప్పుడు కార్డు సృష్టించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

Updated Date - 2021-04-18T08:03:44+05:30 IST