పనిచేసినా సెలవు లెక్కే!
ABN , First Publish Date - 2021-04-22T10:00:23+05:30 IST
వీరవిహారం చేస్తున్న కరోనా వైర్సకు భయపడి ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి జంకుతున్నారు. తప్పదనుకున్న సందర్భంలో ప్రాణాలకు తెగించి కార్యాలయాలకు వస్తున్నా, వారిలో మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు రాని కారణంగా..
- లక్షణాలుండి ఇంటి నుంచి
- చేసిన డ్యూటీని పరిగణించరు
- పైగా సెలవు పెట్టాలని సలహా
- ఆఫీసుకు వద్దామంటే భయం
- తీవ్ర ఆందోళనలో ఉద్యోగులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వీరవిహారం చేస్తున్న కరోనా వైర్సకు భయపడి ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి జంకుతున్నారు. తప్పదనుకున్న సందర్భంలో ప్రాణాలకు తెగించి కార్యాలయాలకు వస్తున్నా, వారిలో మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు రాని కారణంగా, ఎక్కడా ఏ శాఖలోనూ పని ఆగింది లేదు. ఎందుకంటే ఇప్పుడంతా ఇ-ఆఫీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. స్మార్ట్ఫోన్, మొబైల్ డేటా ఉన్న ప్రతి ఉద్యోగీ ఇంటి నుంచి పనిచేయగలుగుతున్నారు. ప్రస్తుతం దాదాపు 40 నుంచి 50 శాతం ఉద్యోగులు హోం ఐసొలేషన్లో ఉండగా, మరికొంత మంది ఉద్యోగులు కరోనా భయం కారణంగా కార్యాలయాలకు రావడం లేదు. వీరంతా ఇ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారికి ఆఫీసు హాజరు పరంగా ఎలాంటి వెసులుబాటు కల్పించడం లేదు. ఇంటి నుంచి చేస్తున్న పనిని పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ హాజరు విషయానికి వచ్చేసరికి మాత్రం ఉద్యోగులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులు పెట్టుకోవాలని చెబుతోంది. సెలవు పెట్టుకోకపోతే వేతనంలో కట్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా తొలి దశలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని ఉద్యోగులు అంటున్నారు. వైరస్ బారిన పడిన ఉద్యోగులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కనీసం వైరస్ బారిన పడినవారికి కూడా ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినతిపత్రం రూపంలో ఇవ్వడం మినహా మరే రకంగానూ ఉద్యోగులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని సిద్ధం చేయడంలో విఫలమవుతున్నారు.